1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By ఠాగూర్

చీకట్లను పారదోలే పండుగ దీపావళి

చీకట్లను పారదోలే పండుగ దీపావళి. కష్టాల్లోనూ సుఖాన్ని కలగనాలనే సందేశాన్ని మానవాళికి అందిస్తోంది. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ ఇది. ఈ దీపావళికు పురాణంలో ఒక కథ ఉంది.
 
నరకాసురుడనే రాక్షస రాజు ప్రజలను హింసిస్తూ ఆనందించేవాడు. అతనికి ఎదురే లేకుండా పోవడంతో భక్తజన బాంధవుడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి బయల్దేరుతాడు. ఆ రాక్షస సంహారానికి తానూ తోడుగా వస్తానంటుంది సత్యభామ. ఆమే స్వయంగా రాక్షస సంహారం చేస్తుంది. దీంతో నరకుడి పీడ వదిలిన ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు. ఆనాటి నుంచి అది ఆనవాయితీగా వస్తోంది.
 
దీపావళి రోజు సిరిసంపదలకు చిహ్నమైన లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆమెతోపాటు పూజలందుకునే మరో దేవుడు గణపతి. అంటే అమావాస్య చీకట్లు అలుముకుంటుండగా, ప్రతి ఇంటా లక్ష్మీగణపతి పూజ మొదలుపెడతారు. భోగభాగ్యాలను ప్రసాదించుమని వేడుకుంటారు. అటుపై పటాకలు కాల్చడం మొదలుపెడతారు. దీంతో అప్పటి వరకు అంధకారం అలుముకున్న ఆకాశంలో దివ్య కాంతులు పూస్తాయి. చూసే అందరి మనస్సులూ ఆనంద డోలికల్లో తేలియాడుతాయి.