బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (03:31 IST)

ఏప్రిల్ తొలివారంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ వేసవిని తట్టుకోవడం ఎలా? ఇలా..!

రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం జరుగుతోందంటే అది కచ్చితంగా వడదెబ్బ కిందే భావించాలి, ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం,

వాతావరణం నిజంగానే మండుతోంది. సంవత్సరాల మధ్య తేడా లేకుండా వేసవి ప్రారంభం కాకముందే ఉక్క జనాలను బాదిపడేస్తోంది. ఈసారి అత్యధిక మరణాల ఖాతాలో వేసవిని రాసుకోవచ్చని అంటున్నారు. ఇంట్లో ఉంటేనే చమట్లు కక్కడం, భరించలేనంత ఉక్కపోత, శరీరం ఉడికిపోతున్న అనుభూతి ఈ వేసవి గడపటం ఎలా అని హడలెత్తిస్తోంది. అలాంటిది తీవ్రమైన ఎండలో తిరగడం జరిగితే కచ్చితంగా వడదెబ్బ తగులుతుందని వైద్యుల హెచ్చరిక. పైగా వేసవిలో నీరు ఆహారం కారణంగా అనారోగ్యాలు ప్రబలి వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె ఫెయిల్యూర్‌ అవడం వంటివి సంభవిస్తాయని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.
 
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వైద్యప్రణాళికలు రచించి వేసవిలో ఏ ఫలితం సాధించలేకపోతున్న నేపథ్యంలో వీధికొక్క చలివేంద్ర ఏర్పాటు చేసి వేడికి కాగుతున్న జనాలకు కాసిని మంచినీళ్లు, మజ్జిగనీళ్లు ఇప్పిస్తే వందలమంది ప్రాణాలు మిగులుతాయని అనుభవం చెబుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు, బయటకెళ్లినప్పుడు కూడా నీళ్ళ బాటిల్ తీసుకుపోవడం ఎట్టిపరిస్తితుల్లోనూ మర్చిపోకూడదు. ఈ ఒక్క పని రోజుకు వందమరణాలను ఆపుతుందని నిపుణులు అంటున్నారు.
 
వేసవిలో, మండే ఎండల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే.. 
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళితే టోపీ, తెల్లటి నూలు వస్త్రాలు ధరించాలి. నీరు, ఇతర ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. మత్తుపానీయాలు తీసుకోకూడదు. వడదెబ్బకు గురైన వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బకు గురైన వారి శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. వారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్‌ లేదా ఓఆర్‌ఎస్‌ కలిపిన నీటిని తాగించాలి.
 
రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం జరుగుతోందంటే అది కచ్చితంగా వడదెబ్బ కిందే భావించాలి, ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, నాలుక తడారిపోవడం జరుగుతోందంటే అది వడదెబ్బ సంకేతమే అని గుర్తించాలి. పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉందంటే వెంటనే వారి శరీరాన్ని చల్లటి నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి. జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటోందంటే ఏమాత్ర నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి వద్దకు పరుగెత్తాలి.