వేసవిలో నీటి కొరత ఉండరాదు.. ఏర్పాట్లు చేయండి : టిటిడి ఈవో
వేసవిలో రానున్న నీటి ఎద్దడిని ముందుగానే గుర్తించి తగు విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ప్రతి ఏడు వేసవిలో రద్దీని అనుసరించి చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం ఈవో వైకుంఠం-1-2 లలో ఆదివారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన అక్కడే ఉన్న అధికారులకు కొన్ని సూచనలు చేశారు. వేసవికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా నీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు.
అలాగే శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకునే భక్తులకు ఎక్కువ సమయం వైకుంఠం కంపార్టుమెంట్లలో వేచి ఉండే పనిలేకుండా నిరంతరాయంగా క్యూ లైన్లను కదిలేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా తనిఖీలలో భాగంగా ఆయన వైకుంఠం-1 మరియు -2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్ధం అమలులో ఉన్న ఫోటో మెట్రిక్ విధానం, నూతనంగా టిటిడి ప్రవేశ పెట్టిన రెండు అదనపు లడ్డూలు భక్తులకు అందించే విధానాన్ని పరిశీలించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడుతూ గత వారం టిటిడి సామాన్య భక్తుల కొరకు ప్రవేశ పెట్టిన 50 రూ|| అదనపు లడ్డూలకు సంబందించి సరైన సమాచారాన్ని అందించే రీతిలో కంపార్టుమెంట్లలో సమాచార బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వైకుంఠం కంపార్టుమెంట్లలోనే కాకుండా తిరుమలలోని వివిధ కీలకమైన ప్రాంతాలలో కూడా అదనపు లడ్డూలకు సంబందించిన వివరాలు అందించే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అనంతరం అక్కడ సేవ చేస్తున్న లడ్డూ ప్రసాద సేవకులతో ఆయన ముచ్చటించారు. ఈ తనిఖీలలో ఈఓతో పాటు ఆలయ డిప్యూటిఇఓ చిన్నంగారి రమణ, ఇఇ-1 కృష్ణారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా.వెంకటరమణ, ఇడిపిఓఎస్డి.బాలాజిప్రసాద్, ఏఎస్ఓ మల్లికార్జున తదితర అధికారులు తనిఖీలలో పాల్గొన్నారు.