సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రారంభం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16 నుంచి జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యింది. తొలి అడుగు వేసింది. మంగళవారం ఉదయం నుంచి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఉదయమే శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. స్వామి వారి దర్శనాన్ని నిలిపేశారు.
సాధారణంగా ఏదైనా పర్వదినం వచ్చే ముందు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఆ పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం చేపడుతారు. వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మొదలు పెట్టారు.
ఆలయంలోని ప్రధాన ద్వారం మొదలు పెట్టి గర్భ గుడి వరకూ ఆలయాన్ని శుద్ధి చేస్తారు. కొన్ని ప్రత్యేక లేపనాలు, నూనెలతో తయారు చేసిన పదార్థాన్ని గర్భాలయ గొడలకు అతికిస్తారు. బయట మాత్రం పసుపుతోపాటు పలు పదార్థాలు వినియోగించిన నీళ్ళతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమం ఉదయం మొదలు పెట్టి 11 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణ మూర్తి, ఈవో సాంబశివరావు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
