గదులు దొరకవు.. దర్శనం కాదు.. తిరుమలలో జనసందోహం
ఒకటే చలి.. రాత్రయితే వేళ్ళు నీలక్కపోతాయి. గజ గజలాడాల్సిందే.. తలదాచుకుందామంటే తావుండదు. నిద్రపోదామంటే ఈదురుగాలులు.. నిలువుకాళ్ళపైనే నిలబడాలి. ఎంతకీ దర్శనమవ్వదు.. కాదంటే ఆ చోటు కూడా దక్కదు. అంగళ్ళు, పార్కులు, పుట్ పాత్ లు, ఎక్కడ చూసినా జనమే జనం. ఇదీ తిరుమలలో భక్తుల పరిస్థితి.
తిరుమల గుడి ఎదుట కిక్కిరిసిన భక్తులు
తిరుమల జనసంద్రంగా మారిపోయింది. యేడాది చివర, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణంగా అయితే సెలవులు వస్తే ఏ పార్కుకో, సినిమాకో వెళ్ళే జనం యేడాది చివర వచ్చిందంటే తిరుమల బాట పడతారు. ఉన్న సెలవులు మిగిలి పోతుండడంతో వాటిని వినియోగించుకోవడానికి తిరుమలకు వస్తారు. ఇది సాధారణంగా డిసెంబర్ 25 నుంచి ఆరంభమవుతుంది. సరిగ్గా ఈ యేడాది కూడా అదే జరిగింది. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న భక్తుల సంఖ్య లక్షకు దాటింది. శనివారం దర్శనం చేసుకున్న వారి సంఖ్య 60 వేల మంది పైమాట.
బారులు తీరిన భక్తులు
దర్శనం కోసం తిరుమల చేరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రాత్రికే భక్తులు బారులు తీరిపోయారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో 31 కంపార్డుమెంట్లు ఉండగా అన్నీ నిండిపోయాయి. ఎక్కడా ఏ ఒక్క కంపార్టుమెంటు ఖాళీగా లేదు. ఇక క్యూ లైను శనివారానికే బయటకు వచ్చేసింది. ఆదివారానికి కనీసం రెండు కిలోమీటర్ల మేరకు బయటకు నడుస్తోంది. నారాయణగిరి ప్రాంతంలోకి జనం నిలబడే ఉన్నారు. వీరందరికి తిరుమల తిరుపతి దేవస్థానం తాగునీరు, ఆహారం సరఫరా చేస్తోంది. భక్తులు కూడా క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. సర్వదర్శనంలో ఉన్న భక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే కనీసం 22 గంటల సమయం పడుతోంది. ఇక కాలి బాటన వచ్చే భక్తులకు కనీసం 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమలకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
వణికిస్తున్న చలి
తిరుమలలో వాతావరణం తీవ్రమైన చలి ఉంటోంది. కొండలు ఎత్తులో ఉండడంతో సాధారణంగానే చల్లగా ఉండే తిరుమలలో ఈ యేడాది మరింత చల్లబడింది. ఎప్పుడు వర్షం కురుస్తుందో చెప్పలేని స్థితి నెలకొంది. తిరుమలలో ఉష్ణోగ్రతలు ఈ యేడాది మరీ పడిపోయాయి. ఒక్కొక్క సారి 10 డిగ్రీలకు కూడా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భక్తులు పగటిపూటే చలి భయపెడుతోంది. ఇక రాత్రిళ్ళయితే చెవులు చల్లబడుతున్నాయి. తిరుమలలో గదులన్నీ నిండిపోయాయి. ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసింది. అక్కడ కూడా భక్తులు నిండిపోయారు. మరికొంతమంది పేవ్ మెంట్లపైనే చలికి వణుకుతూ కాలం గడుపుతున్నారు. ఈ రద్దీ ఇలాగే జనవరి 2 తేది వరకూ కొనసాగే అవకాశం ఉంది.