శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (14:38 IST)

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పదేళ్లు స్పై.. విస్తుపోయే నిజాలు

భారత్ - బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో చైనా గూఢచారి పదేళ్లుగా తిష్టవేసివున్నాడు. ఈ గూఢచారిని ఇటీవల గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చైనాకు చెందిన హాన్ జున్వే వద్ద జరిపిన విచారణలో అనేక విస్తుపోయే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. 
 
హాన్ జున్వే.. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ తరపున భారత్‌లో గూఢచారిగా పనిచేస్తున్నట్లు తేలింది. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వే.. చైనా గూఢచారిగా బీఎస్‌ఎఫ్ విచారణలో వెల్లడైంది. 
 
చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్వే.. మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా ఆర్థికనేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. 
 
గురుగ్రామ్‌లో జున్వే.. ఓ హోటల్‌ సైతం నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. 1300లకు పైగా సిమ్​కార్డులు.. హాన్ జున్వే.. తన సహచరుడితో కలిసి ఇప్పటివరకూ 13 వందలకు పైగా సిమ్‌కార్డులు లోదుస్తుల్లో దాచి అక్రమంగా భారత్‌ నుంచి చైనాకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. 
 
ఈ సిమ్ కార్డుల సాయంతో.. బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం సహా ఇతరత్రా ఆర్థికనేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు గురుగ్రామ్‌లో స్టార్‌ స్ప్రింగ్ పేరిట హోటల్ నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. ఈ హోటల్‌లో కొంతమంది చైనా దేశస్థులను సిబ్బందిగా చేర్చుకున్నట్లు వివరించారు. 
 
అక్రమంగా సిమ్‌ కార్డుల తరలింపునకు సంబంధించి లక్నో ఏటీఎస్‌లో నమోదైన కేసులో హాన్‌ జున్వే వాంటెడ్ నేరస్థుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ కేసు కారణంగా భారతీయ వీసా లభించకపోవటంతో బంగ్లాదేశ్ బిజినెస్ వీసాతో దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. 
 
హాన్‌ జున్వే.. గతంలో నాలుగుసార్లు భారత్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 2010లో హైదరాబాద్ వచ్చిన హాన్ జున్వే.. 2019 తర్వాత ఢిల్లీ గురుగ్రామ్ ప్రాంతాలకు మూడుసార్లు వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. హాన్‌ జున్వే ప్రాథమిక విచారణ పూర్తిచేసిన బీఎస్ఎఫ్ అధికారులు.. ఆయన్ను స్థానిక పోలీసులకు అప్పగించారు.