1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (09:52 IST)

ఇకపై అగ్రరాజ్యంలో మాస్క్ ధరించక్కర్లేదు....

కరోనా వైరస్ మహమ్మారిలో తల్లడిల్లిపోయిన అమెరికా పౌరులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముఖానికి మాస్క్ ధరించాలన్న నిర్బంధ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. ఇకపై కరోనా టీకాలు వేసుకున్న వ్యక్తులు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకటించింది. 
 
రెండు డోసులు టీకా తీసుకున్న వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చని చెప్పింది. కరోనా ఆంక్షలు సడలించాలని అధ్యక్షుడు జోబైడెన్‌ సీడీసీని కోరారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి పట్ల కొవిడ్‌ ఆంక్షలు సడలించాలని బైడెన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి నేపథ్యంలో సీడీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు శ్వేతసౌధంలోని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్క్సీ మార్గదర్శకాలు విడుదల చేశారు. కొవిడ్‌-19 రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తులు.. పని ప్రదేశాలు, పాఠశాలల్లో మాస్క్‌ లేకుండా తిరిగేందుకు అనుమతించింది. అయితే, జనసంద్రం ఉన్న ప్రాంతాలు, బస్సులు, విమానాలు, దవాఖానాలు లాంటి ప్రాంతాల్లో మాత్రం మాస్క్‌లు ధరించడం తప్పనిసరని సీడీసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 
 
మాస్క్‌ నిబంధనలు సడలించడంపై అధ్యక్షుడు జోబైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇదో గొప్ప మైలురాయి, గొప్ప రోజన్నారు. చాలా మంది అమెరిక్లకు వేగంగా టీకాలు వేయడంలో సాధించిన అసాధారణ విజయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు.