మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (08:15 IST)

రాళ్లు, మట్టితో భూమికి బయలుదేరిన చైనా ల్యాండర్

చంద్రమండలం పరిశోధన నిమిత్తం చైనా పంపిన ల్యాండర్ తిరిగి భూమికి పయనమైంది. చంద్రమండలంపై ఉన్న రాళ్లు, మట్టిని సేకరించి భూమికి మరో మూడు రోజుల్లో వస్తుందని చైనా అంతరిక్ష పాలనామండలి తెలిపింది. 
 
ఇటీవల చంద్రుడి పరిశోధన నిమిత్తం చైనా చాంగే-5 ల్యాండర్‌ను నాలుగు దశాబ్దాల విరామం తర్వాత పంపించింది. ఇది విజయవంతంగా చంద్రుడిపై అడుగుపెట్టింది. ఈ నెల మొదట్లో అది చంద్రుడి ఉపరితలంపై దిగి 4.4 పౌండ్ల మట్టి, రాళ్లను సేకరించింది. ప్రస్తుతం ఇది తిరిగి భూమికి చేరుకోనుంది. 
 
చాంగే-5లోని నాలుగు ఇంజన్లను 22 నిమిషాలపాటు యాక్టివేట్ చేసిన అనంతరం క్యాప్సుల్ భూమిపైకి బయలుదేరినట్టు పేర్కొంది. దాదాపు రెండు కిలోల మట్టి, రాళ్లతో ఉత్తర చైనా ప్రాంతంలో ఇది ల్యాండ్ కానుంది.
 
ఈ ల్యాండర్ సేకరించి తీసుకొస్తున్న మట్టి, రాళ్లను విశ్లేషించడం ద్వారా గతంలో అంతుచిక్కని విషయాలతోపాటు చంద్రుడి గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
 
1976లో సోవియట్ యూనియన్‌కు చెందిన లూనా 24 ప్రోబ్ భూమిపైకి జాబిల్లి నమూనాలు తీసుకురాగా, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు చైనా ప్రోబ్ నమూనాలతో భూమిపైకి బయలుదేరింది. 
 
అమెరికా, సోవియట్ యూనియన్ల మిషన్లు భూమికి తీసుకొచ్చిన నమూనాలతో పోలిస్తే చైనా క్యాప్సుల్ మోసుకొస్తున్న నమూనాలు కొన్ని బిలియన్ల సంవత్సరాల తక్కువ వయసున్నవి కావచ్చని చెబుతున్నారు.