1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (07:00 IST)

చంద్రుడుని తవ్వి మట్టిని సేకరించిన 'చాంగే-5' లూనార్ రోబో

చంద్రమండలం పరిశోధన కోసం చైనా ఓ లూనార్ రోబోను ఇటీవల పంపించింది. ఈ రోబో పేరు చాంగే-5. ఈ వ్యోమనౌక సురక్షితంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఈ నౌకలోని లూనార్ రోబో చంద్రుడుని తవ్వి.. కొద్దిగా మట్టిని సేకరించింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎస్‌ఏ బుధవారం వెల్లడించింది. 
 
మంగళవారం చంద్రుడిపై దిగిన వ్యోమనౌకలోని ల్యాండర్‌.. బుధవారం వేకువజామున 4.53 గంటలకు నిర్దేశిత ప్రాంతంలో 2 మీటర్ల లోతున రంధ్రాన్ని తవ్విందని పరిశోధకులు పేర్కొన్నారు. రెండు కిలోల కంటే ఎక్కువ మట్టి నమూనాలను సేకరించి, భద్రపరిచినట్టు భావిస్తున్నామన్నారు. 
 
కాగా, చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రుడి మీద ఉన్న ఓసియానుస్‌ ప్రొసెల్లారమ్‌ అనే ప్రాంతంనుంచి చాంగె-5 మట్టిని సేకరించింది. ఈ సేకరణలో భాగంగా ల్యాండర్‌ రెండు మీటర్ల లోతులోని మట్టిని సేకరించిందని చెప్పారు. మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. దాదాపు రెండు కేజీల మట్టిని సేకరించిందని తెలిపారు.
 
చంద్ర ఉపరితలం నుంచి, అలాగే లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించామని తెలిపారు. మొదటిసారే విజయం సాధించడం గమనార్హం. దీనిపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ చైనా స్పేస్‌ ఏజెన్సీకి అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ పరిశోధనా కమ్యూనిటీ ద్వారా కొన్ని శాంపిళ్లపై పరిశోధన చేసే అవకాశం తమకూ రావచ్చని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
అంతర్జాతీయ సైన్స్‌ కమ్యూనిటీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పింది. చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్‌ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు.