శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (04:25 IST)

అది జాత్యహంకార హత్యే.. ఖండిస్తున్నా: నోరు విప్పిన ట్రంప్‌

ఎట్టకేలకు మొండి బండ గుండెల ట్రంప్ కాస్త కరిగాడు. అమెరికాలోని కన్సాస్‌లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్, అలోక్‌పై జరిగిన కాల్పుల ఘటనపై వారంరోజులుగా నోరు విప్పకుండా మౌనం పాటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది జాత్యహంకార హత్యేనని ప్రకటించాడు. జాతి వ

ఎట్టకేలకు మొండి బండ గుండెల ట్రంప్ కాస్త కరిగాడు. అమెరికాలోని కన్సాస్‌లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్, అలోక్‌పై జరిగిన కాల్పుల ఘటనపై వారంరోజులుగా నోరు విప్పకుండా మౌనం పాటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది జాత్యహంకార హత్యేనని ప్రకటించాడు. జాతి విద్వేష దాడులు ఏ రూపంలో ఉన్నా అమెరికా ఖండిస్తుందన్నారు. ఇటీవల యూధుల సమాధుల ధ్వంసం, కేన్సాస్‌ కాల్పులను జాతి మొత్తం ఏకమై ఖండించాలని పిలుపునిచ్చారు.
 
అమెరికాలోని కేన్సస్‌లో జరిగిన కాల్పుల ఘటన జాతి వివక్షతో కూడిన హత్యేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారు. ఆయన తొలిసారి కాంగ్రెస్‌ సంయుక్త సభలో ప్రసంగించారు. జాతి విద్వేష దాడులు ఏ రూపంలో ఉన్నా అమెరికా ఖండిస్తుందన్నారు. ఇటీవల యూధుల సమాధుల ధ్వంసం, కేన్సాస్‌ కాల్పులను జాతి మొత్తం ఏకమై ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ రాత్రి బ్లాక్‌ హిస్టరీ మంత్‌ సంబరాలను ముగిద్దామన్నారు. 
‘అమెరికా జాతి మూలాలైన పౌరహక్కులు, పనితత్వం ఇంకా మిగిలే ఉన్నాయి. మనపెద్దలు అందించిన నిజాయితీ, స్వేచ్ఛ, న్యాయం వంటి సంప్రదాయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ విషయంలో ప్రపంచానికి మనం మార్గదర్శకులం కావాలి’ అని ట్రంప్‌ అన్నారు. సమైక్యతా బలాన్ని చెప్పేందుకే తాను వచ్చానని.. ఈ సందేశం తన హృదయం నుంచి వచ్చిందని చెప్పారు.
 
కేన్సస్‌ కాల్పుల ఘటనలో మృతుడు శ్రీనివాస్‌కు అమెరికా కాంగ్రెస్‌ సంతాపం ప్రకటించింది. దీనిలో భాగంగా సభ్యులందరూ నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని.. ప్రపంచంలో అమెరికాను అగ్రస్థానంలో కొనసాగించాలన్నారు.
 
ఇటీవల కేన్సస్‌లోని ఓ బార్‌లో శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో తెలుగు యువకుడు అలోక్‌రెడ్డి, దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇయాన్‌ గ్రిలాట్‌ అనే అమెరికన్‌ తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇది జాత్యహంకార హత్యేనని అన్ని వర్గాలు ఆరోపిస్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించలేదు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ వైఖరి విద్వేష ఘటనలు జరిగేందుకు వూతమిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తడంతో చివరకు ఆయన స్పందించారు.