టెనస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు - 19 మంది మృత్యువాత
అమెరికాలోని టెనస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 19 మంది మృత్యువాతపడ్డారు. సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హంస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ ఈ ఘటనపై మాట్లాడుతూ, ఇది అత్యంత వినాశకరమైన పేలుడు అని అభివర్ణించారు. 'ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఉంది. మిగిలిన వారంతా మరణించి ఉండే అవకాశం ఉంది' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, ఫ్యాక్టరీకి సమీపంలోని ఇళ్లు సైతం తీవ్రంగా కంపించాయి. దీంతో ఏం జరిగిందో తెలియక స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా శిథిలాల కుప్పగా మారింది. ప్రమాద తీవ్రత కారణంగా సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.