గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (18:10 IST)

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసుల వరద!!

sheik hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై ఆ దేశంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం వరుస కేసులు పెడుతుంది. ఫలితంగా షేక్ హసీనాపై ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 155కు చేరింది. బంగ్లాదేశ్‌లో చెలరేగిన ప్రజా తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి స్వదేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 
 
మరోవైపు, ఆమెపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఓ హత్య అభియోగాలపై మరో కేసు నమోదైంది. దీంతో షేక్‌ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. 
 
భారత్‌లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి.
 
హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల క్రమంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనా, మరో తొమ్మిది మందిపై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ఐసీటీ) ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది.