శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (17:04 IST)

భారత్ దాడి చేస్తుందని వణికిపోయాం : పాక్ విదేశాంగ మంత్రి

లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ చివరకు పెద్ద యుద్ధానికి దారితీస్తుందని భావించామనీ, ఇదే నెపంతో భారత్ తమపై దాడికి చేస్తుందని భయపడ్డామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ తెలిపారు. 
 
ప్రస్తుతం భారత్ - చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు ఘర్షణలపై ఆయన స్పందిస్తూ, గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధానికి దారితీస్తుందని, ఇదేసమయంలో భారత్‌ తమపై కూడా యుద్ధానికి దిగుతుందని ఆందోళన చెందినట్టు తెలిపారు. 
 
గల్వాన్‌ లోయలో భారత్‌ - చైనా సైనికుల మద్య జరిగిన ఘర్షణను తాము సీరియస్‌గా తీసుకొన్నామని, వారి మధ్య చెలరేగిన ఉద్రిక్తత ఎక్కడ తమపైకి యుద్ధం రూపంలో వస్తుందని భయపడ్డామన్నారు. అయితే, తామేమీ చూస్తూ కూర్చోమని, ధీటుగానే సమాధానమిస్తామని తెలిపారు. 
 
మే 31వ తేదీన ఇద్దరు పాకిస్థాన్ ఎంబసీ అధికారులు గూఢచర్యం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. ఇద్దరు అధికారులు ఒక వ్యక్తిని డబ్బుతో ఆకర్షించి భద్రతా పత్రాలు తీసుకుంటున్నప్పుడు వారిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. అనంతరం వీరిని 24 గంటల్లోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. 
 
దీనిపై కూడా ఆయన స్పందించారు. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్ కార్యాలయం నుంచి 50 శాతం ఉద్యోగులను ఉపసంహరించుకోవాలని భారత్‌ సూచించాన్ని తాము ఖండిస్తున్నట్టు చెప్పారు. మేము కూడా మా దేశంలోని భారత హైకమిషన్ ఉద్యోగులను తమ దేశానికి వెళ్లిపొమ్మంటాం విదేశాంగ మంత్రి తెలిపారు.