శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (14:26 IST)

ఇండిగో విమానం కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. కానీ అతడి ప్రాణాలు..?

ఇండిగో విమానం అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం ల్యాండ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. షార్జా నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానం 6ఇ1412 మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు పాక్ గగనతంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని కరాచీకి దారి మళ్లించినట్టు ఏవియేషన్ అథారిటీ వర్గాలను ఉటంకిస్తూ పాక్ జియా న్యూస్ తెలిపింది. 
 
ఇండిగో సైతం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని కరాచీకి మళ్లించామని, దురదృష్టవశాత్తూ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడలేకపోయామని, విమానాశ్రయ వైద్య సిబ్బంది వచ్చేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
 
గత ఏడాది నవంబర్‌లోనూ ఢిల్లీ బౌండ్ గోఎయిర్ విమానం 179 మంది ప్రయాణికులతో బయలుదేరి, ఒక ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అయితే అప్పటికే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మగ ప్రయాణీకుడికి అన్ని వైద్య సహాయం ఆన్‌బోర్డ్‌లో అందించబడింది. కానీ ఆయన్ని కాపాడుకోలేకపోయామని అధికారులు తెలిపారు.