శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 జూన్ 2025 (19:13 IST)

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

plane
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ఇరాన్ దేశంలో ఉన్న భారత పౌరులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇందుకోసం కేంద్రం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్‌లో చిక్కుకునిపోయిన భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు వీలుగా ఆపరేషన్ సింధును చేపట్టింది. ఇందులోభాగంగా, ఇరాన్‌కు భారత్ ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు. 
 
అయితే, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, భారత్ వినతి మేరకు ఆపరేషన్ సింధు కోసం ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది. ఫలితంగా ఇరాన్‌లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. తొలి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకోనుండగా, మరో రెండు విమానాలు శనివారం దిగనున్నట్టు సమాచారం. అయితే, దీనికి ముందు ఇరాన్ నుంచి ఇప్పపటికే 110 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నప్పటికీ వీరు తొలుత ఆర్మేనియా అక్కడ నుంచి భారత్‌కు వచ్చారు.
 
వారం క్రితం ఇజ్రాయెల్ చేసిన మెరుపుదాడులతో ఇరాన్‌లోని అనేక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్‌లతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఇరాన్ ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడంతో తరలింపు ప్రక్రియ సులభంకానుంది. ఇదిలావుంటే ఇరాన్‌లో దాదాపు 4 వేలమంది భారతీయులు ఉండగా, అందులో 2 వేల మంది విద్యార్థులేనని సమాచారం.