మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (21:16 IST)

యువకుడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసిన ఉల్క!... ఎలా?

ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. దీనికి కారణం ఓ ఉల్క. అంతరిక్షం నుంచి శరవేగంతో దూసుకొచ్చిన ఓ ఉల్క.. అతని ఇంటిపై పడింది. అంతే.. ఆ ఉల్క రాయే ఆ యువకుడుని కోటీశ్వరుడుని చేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని సముత్రా దీవుల్లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సమత్రా దీవులకు చెందిన జాషువా హుటాగలుంగ్ (33) శవపేటికలు తయారు చేస్తూ జీవితం గడుపుతున్నాడు. గత ఆగస్టులో ఓ రోజు శవపేటిక తయారు చేస్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. 
 
ఇంటి వరండా పైకప్పును బద్దలు కొట్టుకుంటూ ఓ గట్టి రాయి వంటి వస్తువు ఆకాశం నుంచి రాలిపడింది. ఆ రాయి పడిన శబ్దానికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అదిరిపోయాయి. ఆ రాయి ఎంతో విశిష్టత కలిగిన అంతరిక్ష ఉల్కగా నిర్ధారణ అయింది.
 
ఇటీవల ఆ ఉల్కను ఆ కుర్రోడు విక్రయానికి పెట్టాడు. అది కాస్త ఏకంగా రూ.9.8 కోట్ల ధర పలికింది. దాంతో శవపేటికలు తయారు చేసుకుంటూ పొట్టపోసుకునే జాషువా ఉన్నఫళాన సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. 
 
దీనిపై జాషువా మీడియాతో మాట్లాడుతూ, పనిచేసుకుంటుండగా భారీ పేలుడు వంటి శబ్దం వినిపించిందని, చూస్తే వరండా పైకప్పు పగలిపోయి కనిపించిందని తెలిపాడు. దగ్గరకెళ్లి చూస్తే అక్కడో రాయి వంటి వస్తువు కనిపించిందని, దాన్ని పట్టుకోగానే ఎంతో వేడిగా ఉందని వివరించాడు. దాంతో ఆ రాయిని జాషువా ఫేస్‌ బుక్‌లో పోస్టు చేయగా విశేషమైన స్పందన లభించింది.
 
అమెరికాకు చెందిన అరుదైన వస్తుసేకర్త జారెడ్ కొలిన్స్ ఈ ఉల్క శిలను జాషువా నుంచి కొనుగోలు చేసి తన సహ వస్తు సేకర్త అయిన జే పియాటెక్‌కు విక్రయించాడు. ప్రస్తుతం ఈ ఉల్కను పరిశోధనల నిమిత్తం అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ద్రవరూప నైట్రోజన్‌లో భద్రపరిచారు.