పాకిస్థాన్లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు
పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఏకంగా రైలును హైజాక్ చేశారు. జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసి అందులోని 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. గత కొంతకాలంగా బలూచిస్థాన్ విముక్తి కోసం బీఎల్ఏ వేర్పాటువాదులు పోరాటం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో 400 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ రైలుపై బీఎల్ఏ మిలిటెంట్లు దాడి చేసి, రైలులోని మొత్తం 9 బోగీలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రైలును హైజాక్ చేసినట్టు బీఎల్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. పాక్ భద్రతా బలగాలు తమపై ఏదేనీ చర్యకు దిగితే మాత్రం బందీలుగా ఉన్న ప్రయాణికులందరినీ హతమార్చుతామని హెచ్చరించింది.
పాకిస్థాన్ దేశంలో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్గా వుంది. ఆ దేశంలోని 44 శాతం భూభాగం ఈ రాష్ట్ర పరిధిలోకే వస్తుంది. అయితే, దేశంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం కూడా ఇదే కావడం గమనార్హం. అలాగే, ప్రపంచంలనే అత్యంత పొడవైన డీప్ సీ పోర్టుల్లో ఒకటైన గ్వాదర్ పోర్టు బలూచిస్థాన్ రాష్ట్రంలోనే ఉంది. దీంతో బీఎల్ఏ మిలిటెంట్లు స్వయంప్రతిపత్తి కోసం పోరాటం చేస్తుంటే, వారిని పాక్ ఆర్మీ బలగాలు అణిచివేస్తున్నాయి.