మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!
మయన్మార్ దేశంలో మృత్యువు విలయతాండవం చేసింది. ఇటీవల వచ్చిన భూకంపం ధాటికి ఆ దేశం శ్మశానవాటికగా మారిపోయింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 2700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. ఈ పెను విపత్తు కారణంగా అనేక భారీ భవంతులు కుప్పకూలిపోయాయి. ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంప బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, నివాసం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి.
కాగా, ఈ భూవిలయం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 2700 దాటినట్టు మయన్మార్ సైన్యాధ్యక్షుడు జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ ప్రకటించారు. మరో 4521 మంది గాయపగా, 441 మంది ఆచూకీ తెలియడం లేదని వెల్లడించారు. ప్రధానంగా ఈ మరణాలు మయన్మార్ దేశ రాజధాని నేపిడా, రెండే అతిపెద్ద నగరమైన మాండలేలోనే అధికంగా ఉన్నాయని పేర్కొ న్నారు. అయితే, ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి నలుగురు ఆచూకీ తెలియడం లేదు. మరికొందరు గాయపడ్డారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పేలుడు సంభవించిన ఇంటిని కొందరు బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి భారీ శబ్దంతో ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
పేలుడు సంభవించి సమయంలో ఇంట్లో 11 మంది ఉండగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.