1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (10:58 IST)

చైనాలో మరో ప్రాణాంత జబ్బు.. భయపెడుతున్న వ్యాధి...

new virus
ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకున్న కొవిడ్ 19 వైరస్ చైనా దేశంలోని వ్యూహాన్ నగరం నుంచి వ్యాప్తి చెందింది. ఈ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆ దేశాన్ని మరో ప్రాణంతక జబ్బు పట్టుకుంది. పాఠశాలలకు వెళుతున్న చిన్నారుల్లో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
'బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఈ అంతు చిక్కని న్యుమోనియా రకం వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి' అని ప్రొమెడ్ సంస్థ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. 
 
ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం అసాధారణ విషయమని, ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా.. పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని పేర్కొంది. పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇది కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రోమెడ్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రుల వద్ద చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు క్యూ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే.