భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం : పాకిస్థాన్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తమ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత సైనిక బలగాలు దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని వెల్లడించింది. భారత్ జరిపిన దాడుల్లో ముగ్గురు మరణించారని, 12 మంది గాయపడ్డారని తెలిపింది.
ఇదే అంశంపై పాక్ డీజీ ఐఎసీపీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ, కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో భారత్ దాడులు జరిపిందని తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని, మరో 12 మంది గాయపడ్డారని పాక్ ఆర్మీ ప్రకటించింది. సమయం చూసి భారత్కు తగిన రీతిలో బదులిస్తామని, "భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం" అని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, ఈ దాడులపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తీవ్రంగా స్పందించారు. "మోసపూరిత శత్రువు పాకిస్థాన్లోని ఐదు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ చర్యలకు పాకిస్థాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్కు, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం" అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ దాడులను ఆయన 'యుద్ధ చర్య'గా అభివర్ణించారు.
పాక్ ప్రధాని ప్రకటన అనంతరం, సరిహద్దులోని పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో, భారత దళాలు కూడా ప్రతిగా కాల్పులు జరిపాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒకటైన మురిడ్కే లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉండగా, పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూరులో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్-ఎ-మహ్మద్ స్థావరం ఉండటం గమనార్హం.