బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (11:01 IST)

పాకిస్థాన్‍‌లో అంధకారం... సాయం చేసేందుకు అమెరికా సిద్ధం

power cuts
దాయాది దేశం పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. సోమవారం ఉదయం నుంచి ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్‌, ఇస్లామాబాద్ నగరాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ట్రాన్స్‌మిషన్లలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని పాకిస్థాన్ విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, అటు ఆర్థిక సంక్షోభం, అటు విద్యుత్ అంతరాయంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను అన్ని విధాలైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, పాకిస్థాన్‌ దేశానిక విద్యుత్ సరఫరా చేసే ప్రధాన పవర్ గ్రిడ్ ఫెయిల్యూల్ కావడంతో గాండాంధకారం నెలకొంది. ఈ కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నగరాలు కూడా పూర్తిగా అంధకారంలో నెలకొన్నాయి. అలాగే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని 22 జిల్లాల్లో అంధకారం నెలకొంది. నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్ గ్రిడ్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ట్వీట్ చేసింది. 
 
దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధృవీకరించాయని పాకిస్థాన్ అధికారిక టీవీ చానెల్ జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టా నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది.
 
బలూచిస్థాన్‌లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, లాహోర్, కరాచీలోని పలు ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకున్నాయని అధికారులు వెల్లడించాయి. ఇస్లామాబాద్‌లోని 117 పవర్ గ్రిడ్ స్టేషన్లతో పాటు పెషావర్‌లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.