అణ్వాయుధ సంపత్తికి పదును పెడుతున్న పాకిస్థాన్... చైనా అండదండలు...
భారత్తో ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తున్న పాకిస్థాన్ తన అణ్వాయుధ సంపత్తికి మరింత పదును పెట్టాలని భావిస్తుంది. ఇందుకోసం చైనా సహకారాన్ని తీసుకోనుంది. పాకిస్థాన్ తన అణ్వాయుధ సంపత్తిని చైనా సైనిక, ఆర్థిక సహకారంతో వేగంగా ఆధునికీకరించాలని భావిస్తుంది.
భారత్ వల్ల ఎప్పటికైనా తమకు ముప్పుతప్పదన్నది పాకిస్థాన్ పాలకుల భయం. ఇది తమ ఉనికికే ముప్పుగా పరిగణిస్తోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ (యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఆదివారం విడుదలైన 'ప్రపంచ ముప్పు అంచనా నివేదిక'లో ఈ కీలక విషయాలను పేర్కొంది. రానున్న సంవత్సరంలో పాకిస్థాన్ సైన్యానికి సరిహద్దుల్లో జరిగే ఘర్షణలతో పాటు, అణ్వాయుధాల ఆధునికీకరణ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండనున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించుకోవడంతో పాటు, అణు పదార్థాలు, అణు నియంత్రణ వ్యవస్థల భద్రతను కొనసాగిస్తోంది. సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీకి అవసరమైన వస్తువులను విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి పాకిస్థాన్ సమకూర్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది' అని నివేదిక వివరించింది.
ఈ సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీకి అవసరమైన సాంకేతికత, సామగ్రిని పాకిస్థాన్ చైనా నుంచి పొందుతోందని, వీటిలో కొన్ని హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ద్వారా పాకిస్థాన్కు చేరుతున్నాయని కూడా నివేదిక వెలుగులోకి తెచ్చింది.
చైనా ప్రధానంగా పాకిస్థాను సైనిక సామగ్రిని సరఫరా చేస్తున్నప్పటికీ, పాకిస్థాన్లో పనిచేస్తున్న చైనా జాతీయులపై జరుగుతున్న వరుస ఉగ్రదాడుల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయని, ఇది ఇరు మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణంగా మారుతోందని నివేదికలో పేర్కొన్నారు.
"భారతదేశాన్ని తమ ఉనికికే ప్రమాదంగా పాకిస్థాన్ పరిగణిస్తోంది. అందుకే, భారత్ సంప్రదాయ సైనిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి యుద్ధరంగంలో ఉపయోగించే అణ్వాయుధాల అభివృద్ధితో సహా తన సైనిక ఆధునికీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తోంది" అని నివేదిక తెలిపింది.