ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (13:00 IST)

ఉక్రెయిన్ - రష్యా యుద్దం... ఆగస్టులో ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోడీ!!

narendra modi
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఒకానొక దశలో భీకర పోరు సాగింది. రష్యా దళాలను ఉక్రెయిన్ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. అయితే రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో ఉక్రెయిన్ దేశ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై కీలక చర్చలు జరిపిన వేళ... ఇపుడు మోడీ ఉక్రెయిన్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి సామరస్యంగా శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ భారత్ కోరుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో నెల క్రితం ఇటలీలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలుసుకున్నారు. ఇటీవలి మోడీ రష్యా పర్యటనపై జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ పిల్లల ఆసుపత్రిపై రష్యా మిసైల్ దాడి జరిగిన రోజునే మోడీ, పుతిన్‌లు సమావేశమయ్యారంటూ జెలెన్‌స్కీ అప్పట్లో మండిపడ్డారు. ఇది చాలా నిరాశపరిచే పరిణామమని, శాంతి స్థాపన కసరత్తుకు గొడ్డలి పెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. 
 
అంతకుముందు ప్రధాని మోడీ ఎన్నికల విజయంపై శుభాకాంక్షలు తెలిపిన జెలెన్‌స్కీ తమ దేశంలో పర్యటించాలని ఆయనను ఆహ్వానించారు. మార్చిలో మోడీతో ఫోన్ కాల్ సందర్భంగా కూడా ఆయన ఇరు దేశాల దౌత్యబంధం బలోపేతం చేసే చర్యలపై చర్చించారు. చర్చలు, దౌత్యం ద్వారానే రష్యాతో యుద్ధానికి ముగింపు పలకాలని ఆకాంక్షించారు. సమస్యకు సామరస్య పరిష్కారం కోసం తాను చేయగలిగినంతా చేస్తానని మోడీ అప్పట్లోనే మాటిచ్చారు.