గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (10:18 IST)

హసీనాకు ఆశ్రయమిచ్చిన భారత్... యూకే సర్కారు అనుమతి ఇచ్చేవరకు...

sheik hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది. ఆమె ఆశ్రయం కోసం బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకు భారత్‌లోనే ఉంటారు. బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లను వర్తింపజేశారు. ఇది ఆ దేశ నిరుద్యోగ యువతలో ఆగ్రహం తెప్పించింది. ఈ రిజర్వేషన్ చిచ్చు దేశ వ్యాప్తంగా వ్యాపించింది. ఫలితంగా రిజర్వేషన్ల కోటాను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగార్థులు ఆందోళనలకు దిగారు. ఈ కారణంగా దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
 
భద్రత కోసం పక్కనే ఉన్న భారత్‌కు ఆమె సోమవారమే వచ్చారు. అయితే ఆమె ఇక్కడ తాత్కాలిక నివాసం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ఆమె నివాసానికి తాత్కాలిక ఆమోదం మాత్రమే లభించిందని, యూకేలో ఆశ్రయం అంశం ప్రస్తుతం పెండింగులో ఉందని పేర్కొంది.
 
హసీనా యూకేలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారని, అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు ఆమె భారత్‌లోనే ఉంటారని డైలీ సన్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం విజ్ఞప్తికి సంబంధించి ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదని పేర్కొంది. హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపింది. 
 
మరోవైపు, షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా రెహానా కూతురు తులిప్ సిద్ధిక్ బ్రిటీష్ పార్లమెంటు ఎంపీగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూకేలో లేబర్ పార్టీ తరపున ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలావుంటే, బంగ్లాదేశ్‌లో అన్ని రకాల పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ పరిణామాలను భారత్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం రాత్రి భేటీ అయ్యింది.