ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (12:48 IST)

శ్రీలంకలో పెట్రోల్ కోసం ఎండలో నిలబడి 10 మంది మత్యువాత

sri lanka
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాటు ఇంధన సంక్షోభం కూడా తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర విషాద సంఘటనలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా ఇంధనం కోసం బంకుల ముందు రోజుల తరబడి క్యూలోనే వేచిచూడాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 
 
అలా నిరీక్షిస్తూ క్యూలోనే తనువు చాలిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఐదురోజుల పాటు క్యూలో ఉండి చివరకు ప్రాణాలు విడిచినట్టు శ్రీలంక మీడియా పేర్కొంది. ఇలా ఇంధనం కోసం వేచిచూస్తూ మరణించిన వారిసంఖ్య పదికి చేరడం శ్రీలంక సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
 
వాహనంలో ఇంధనం నింపుకునేందుకు ఓ 63 ఏళ్ల వృద్ధుడు అంగురువటోటలోని పెట్రోల్‌ బంకు వద్ద వేచిచూస్తున్నాడు. అలా ఐదురోజులు అయినప్పటికీ ఇంధనాన్ని నింపుకోలేకపోయాడు. చివరకు తన వాహనంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. 
 
ఇలా ఇంధనం కోసం క్యూలో వేచిచూస్తూ మరణించడం ఇదో పదో సంఘటన అని పేర్కొన్నారు. చనిపోయిన వాళ్లందరూ 43 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న వారే. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు శ్రీలంక మీడియా వెల్లడించింది. రాజధాని కొలంబోలోని పానాదుర ప్రాంతంలో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద క్యూలో నిలబడిన ఓ 53ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనికితోడు ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక.. పౌరుల నుంచి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు, పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది.