1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:06 IST)

కొలంబస్‌ ఫుడ్‌కోర్టులో కాల్పుల కలకలం.. ఏలూరులో విషాదం...

gunshot
అమెరికాలో మరోమారు కాల్పులు మోత మోగింది. ఓహియో రాష్ట్ర రాజధాని కొలంబస్‌లోని ఓ ఫుడ్‌కోర్టులో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. రాజధాని కొలంబస్ నగరంలోని ఓ ఫుడ్ కోర్టులోకి చొరబడిన దండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 
 
ఓహియో రాష్ట్రం రాష్ట్ర రాజధాని కొలంబస్‌లోని ఫ్రాంక్లిన్ గ్యాస్ స్టేషన్ వెనుక ఓ ఫుడ్‌ కోర్టు ఉంది. ఇక్కడ స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 12.50 గంటల సమయంలో ఇద్దరు అగంతుకులు ఫుడ్‌కోర్టులో ప్రవేశించి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన సాయీశ్ వీర (24) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
వెస్ట్ బ్రాడ్‌ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌లో సాయీశ్ వీర క్లర్కుగా పని చేస్తున్నాడు. సాయీశ్ మరణ వార్త తెలిసిన అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయీశ్ హెచ్1బి వీసా కూడా తీసుకున్నాడు. కాగా, ఈ దారుణానికి పాల్పడిన నిందింతుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.