మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (19:06 IST)

చంద్రుడులో పగుళ్లు... ప్రకంపనలు.. 150 అడుగులు తగ్గిన వ్యాసార్థం (Video)

రానురాను కుంచించుకునిపోతున్నాడు. అంతర్గతంగా ఉన్న శీతల పరిస్థితుల వల్ల చందమామ వైశాల్యం క్రమంగా తగ్గిపోతోంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా వెల్లడించింది. గడిచిన కొన్ని కోట్ల యేళ్ళ కాలంలో దాదాపు 150 అడుగుల మేర (50 మీటర్లు) కుంచించుకుపోయినట్టు వెల్లడించింది. 
 
ఈ కారణంగా చంద్రుడి ఉపరితలంపై ముడుతలు, పగుళ్లు, ప్రకంపనలు ఏర్పడుతున్నాయని తెలిపింది. ద్రాక్ష పండు ఎండిపోతున్నప్పుడు చర్మం ఎలా మారుతుందో.. చంద్రుడి ఉపరితలం అదేవిధంగా రూపాంతరం చెందుతున్నట్టు వివరించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ల్యూనార్ రికాన్నైస్సన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్వో) ఎయిర్‌క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. 
 
ముఖ్యంగా, చంద్రమండలంలోని ఉత్తర ధృవం బాగా కుంచించుకుని పోయినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నాయని, మార్పులు చెందుతున్నదని నిర్ధారించారు. మొత్తం 3,500 చిత్రాల్లో ఈ మార్పులు గుర్తించామని, కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపింది. 
 
"ఇది అద్భుతం. 50 యేళ్ళ కిందట సిస్మోమీటర్లు అందించిన సమాచారం, ఇప్పుడు ఎల్‌ఆర్వో పంపిన సమాచారం కలిపి చూస్తే చంద్రుడి ఉపరితలంలో జరిగిన మార్పులను గుర్తించగలిగాం. కోట్ల ఏండ్లుగా సూర్యుడు, అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్‌ను గ్రహించడం వల్ల చంద్రుడి శీతల ప్రాతంలో ఉన్న ఉపరితలం మొత్తం నలుపురంగులోకి మారిపోయింది.
 
ఇటీవలి ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడినప్పుడు కింది పొరలు బహిర్గతమయ్యాయి. ఈ ప్రాంతం నుంచి కాంతి పరావర్తనం చెందుతున్నది. సిస్మోమీటర్లు పంపిన ప్రకంపనల ప్రాంతాలను ఎల్‌ఆర్వో పంపిన చిత్రాల్లో పోల్చిచూడగా.. వెలుగుమచ్చలు కనిపించాయి. చంద్రుడిపై తీవ్ర ప్రకంపనలు ఏర్పడుతున్నాయని అనడానికి ఇదే నిదర్శనం" అని నాసా పరిశోధక బృంద సభ్యుడు జాన్ కెల్లర్ వివరించారు. 
 
భూమి మాదిరిగా చంద్రుడిపై టెక్టానిక్ ప్లేట్లు ఉండవు. 450 కోట్ల ఏండ్ల కిందట చంద్రుడు ఏర్పడినప్పుడు ఈ ప్లేట్ల ఏర్పాటు ప్రారంభమైనా.. ఉష్ణోగ్రతలను కోల్పోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటినుంచి ద్రాక్షపండు పైపొర, దాని కింది గుజ్జు మాదిరిగానే చంద్రుడి ఉపరితలం, లోపలి పొరలు పెళుసుగా ఉన్నాయి. కొన్నేళ్ల తర్వాత అంతర్గతంగా అత్యంత శీతల పరిస్థితులు ఉండటంతో, లోపలి పొరలు మెల్లిగా కుంచించుకుపోవడం ప్రారంభించాయి. 
 
ఈ క్రమంలో లోపలి పొరల్లోని పదార్థంలో కొంతభాగం ఉపరితలంవైపు చొచ్చుకొస్తున్నది. ఫలితంగా పైపొరపై ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడంతోపాటు ముడుతలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో భూకంపాల మాదిరిగా తరుచూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నదని శాస్త్రవేత్తల బృంద సభ్యుడు థామస్ వాటర్స్ తెలిపారు.