1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (13:36 IST)

కొబ్బరి చెట్టుపైనే మూడేళ్ల పాటు సంసారం.. అతడిని ఎలా దించారంటే? (Video)

తుపాకీతో కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు కొబ్బరి చెట్టుపైనే జీవనం సాగించాడు. 2014లో ఫిలిప్పీన్స్ లోని అగుసాన్ డెల్ ప్రావిన్స్ ప్రాంతంలోని

తుపాకీతో కొట్టడంతో మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు కొబ్బరి చెట్టుపైనే జీవనం సాగించాడు. 2014లో ఫిలిప్పీన్స్ లోని అగుసాన్ డెల్ ప్రావిన్స్ ప్రాంతంలోని లాపెజ్‌లో ఏర్పడిన చిన్న ఘర్షణలో అదే ప్రాంతానికి చెందిన గిల్బెర్ట్ సాంచెజ్ (47) తలపై తుపాకీతో కొట్టారు. తీవ్రభయాందోళనలకు గురైన గిల్బెర్ట్ మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో తన ఇంటి సమీపంలోని 60 అడుగుల చెట్టు ఎక్కాడు.
 
ఎంత చెప్పినా కిందికి దిగిరాలేదు. గిల్బెర్ట్ తల్లి, చెల్లెలు, కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా.. ఎన్నేళ్లు గడిచినా కిందకు దిగిరాలేదు. కిందికి దిగితే చంపేస్తారంటూ గిల్బెర్ట్ వాదించడంతో అందరూ మౌనం వహించి, అతనికి ఆహారం, సిగరెట్లు, దుస్తులు చెట్టుపైకి అందించేవారు. ఇలా దాదాపు మూడేళ్లకుపైగా అతను కొబ్బరి చెట్టుపైనే ఉండిపోయాడు. దీంతో అతనికి చర్మ వ్యాధులు సోకాయి. అతని శరీరం నుంచి దుర్వాసన వచ్చేది. అయినప్పటికీ ఆయన కిందికి దిగలేదు. స్థానికులకు ఈ విషయం తెలిసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. 
 
సోషల్ మీడియాలో ఈ వ్యక్తికి సంబంధించిన స్టోరీ పోస్టు ద్వారా వెలుగులోకి రావడంతో.. అది వైరల్‌ అయ్యింది. దీంతో మీడియా వేగంగా స్పందించింది. అందులో వాస్తవమెంతో తెలుసుకునేందుకు అతని ఇంటికి వెళ్లింది. వాస్తవమని నిర్ధారించుకుని మీడియాలో అతని కథనం ప్రసారం చేసింది. ఈ కథనాన్ని చూసిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేక రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేసింది. 
 
50 మందితో కూడిన ఆ రెస్క్యూ టీమ్ గత అక్టోబర్‌ 11న గిల్బెర్ట్‌ను కిందికి దించారు. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను కండరాల క్షీణత, వెన్నెముక సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ స్టోరీ వైరల్ కావడంతో ఆతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు సర్కారుతో పాటు దాతలు ముందుకొస్తున్నారు.