గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2019 (16:40 IST)

ఇమ్రాన్... ఇప్పటికైనా అర్థం చేసుకో: పాకిస్తాన్‌కి షాకిచ్చిన ట్రంప్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి షాకుల మీద షాకులిస్తున్నాయి అగ్ర రాజ్యాలు. ముఖ్యంగా కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిన అమెరికా ఆ మాట ఊసెత్తడంలేదు. పైగా కశ్మీర్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోవడంలేదు. ఈ వ్యవహారం ఇమ్రాన్ ఖాన్ కు చిర్రెత్తికొస్తోంది. ఐతే అగ్రరాజ్యాలు అలా మొండికేయడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుని కూర్చున్నారు. 
 
ఇలా కూర్చున్న ఇమ్రాన్ కు మరో పిడుగులాంటి వార్త చేరింది. అది కాస్తా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్ట తయారైంది. అసలే కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం మద్దతు లభించక మూలుగుతుంటే అగ్రరాజ్యం అమెరికా ఇచ్చిన కొత్త షాకుతో గింగరాలు తిరుగుతోంది పాకిస్తాన్. పాకిస్థాన్‌తో మెరుగైన భాగస్వామ్య ఒప్పందం 2010 కింద ఆ దేశానికి అందజేయాల్సి ఉన్న ఆర్థిక సాయంలో కోత పెట్టి గట్టి షాకిచ్చింది. 
 
పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టేందుకు ఇస్తున్న నిధులను వాటికి వినియోగించకపోగా తీవ్రవాదులను మరింత పెంచిపోషిస్తున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తం 7.5 బిలియన్ డాలర్లు సాయం చేయాల్సి వుండగా అందులో సగానికి సగం కోత వేసి 4.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఐతే భవిష్యత్తులో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఎలాంటి చర్యలు తీసుకోనట్లయితే ఇంకా ఇవ్వాల్సిన నిధుల్లో మరింత కోత వేసే అవకాశం వున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. 
 
కరడుగట్టిన హక్కానీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను అడ్డుకుని, వారిని ఏరివేయడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ గత సంవత్సరంలోనే బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయాన్ని నిలిపివేసి షాకిచ్చింది. ఇప్పుడు మరోసారి పుండు మీద కారం జల్లినట్లు మళ్లీ ఆర్థిక సాయంలో కోత విధించడంతో ఇమ్రాన్ ఖాన్ అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది.