1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (07:49 IST)

ఐపీఎల్ 14 సీజన్ : ముంబై ఇండియన్స్ కథ కంచికి...

ఐపీఎల్ 14వ సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. ఆ జట్టు ఈ దఫా ఫ్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిదారిపట్టింది. శుక్రవారం రాత్రి ఆ జట్టు ఆడిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో 170కిపైగా పరుగుల తేడాతో విజయం సాధిస్తే ఫ్లే ఆఫ్స్‌లోకి వెళ్లే అవకాశం ఉండటంతో బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత సేపు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ఇషాన్ ముంబై తరపున అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీ నమోదు చేశాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఇషాన్ మొత్తంగా 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి క్రీజ్‌లో వున్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. 
 
మరోవైపు, సూర్యకుమార్ యాదవ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 4, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసుకున్నాడు.
 
ఆ తర్వాత 236 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ధాటిగానే ఆడింది. గత మ్యాచుల్లో ఎప్పుడూ కనిపించనంత జోరు కనబర్చింది. లక్ష్యాన్ని ఛేదించాలన్న కసి హైదరాబాద్ బ్యాటర్లలో కనిపించింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసి విజయానికి 43 పరుగుల ముందు ఆగిపోయింది.
 
జేసన్ రాయ్ 34, అభిషేక్ శర్మ 33, కెప్టెన్ మనీష్ పాండే 69, ప్రియం గార్గ్ 29 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రా, కౌల్టర్ నైల్, నీషమ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, బౌల్డ్, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాట్‌తో విరుచుకుపడిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబై ఇంటి బాట పట్టడంతో కోల్‌కతాకు ప్లే ఆఫ్స్‌లో బెర్త్ ఖరారైంది.