1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:55 IST)

గులాబ్ జామూన్‌‌లో బొద్దింక: ఆ హోటల్‌కు రూ.55వేల జరిమానా

హోటల్ ఫుడ్ ఐతే ఒక్కోసారి ఆ ఆహార పదార్థాల్లో ఈగలు, దోమలు, బొద్దింకలు వంటివి కనిపిస్తుంటాయి. కొందరు లైట్ తీసుకొని ఆ భోజనాన్ని వదిలివేసి వెళ్తుంటారు. మరికొందరు మాత్రం హోటల్ వారితో గొడవపెట్టుకుంటారు. ఇంకొందరైతే అంత ఈజీగా వదలరు. కోర్టుల దాకా వెళ్తుంటారు.

తాజాగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. గులాబ్ జామూన్‌‌లో బొద్దింక వచ్చిందని హోటల్ యాజమాన్యానికి చుక్కలు చూపించాడు. భారీగా జరిమానా విధించే వరకు వదల్లేదు.
 
రాజణ్ణ అనే వ్యక్తి 2016లో బెంగళూరులోని గాంధీనగర్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ గులాబ్ జామూన్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ వచ్చిన వెంటే.. ఎంతో ఇష్టంగా లాగించేశాడు. కానీ కాసేపటికి చనిపోయిన ఓ బొద్దింక అందులో కనిపించింది. దానిని చూసి రాజణ్ణ షాక్ అయ్యాడు. వెంటనే సిబ్బందిని పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారు సరిగ్గా స్పందించకపోవడంతో హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు. 
 
అక్కడి నుంచి కూడా నిర్లక్ష్యమైన సమాధానమే వినిపించడంతో.. రాజణ్ణచు చిర్రెత్తుకొచ్చింది. ఆ మొత్తం తతంగాన్ని మొబైల్ కెమెరాలో రికార్డు చేశారు. అతడు వీడియో చేస్తున్న క్రమంలో సిబ్బంది లాక్కునే ప్రయత్నం చేశారు. వీడియో బయటకు వెళ్తే హోటల్‌కు చెడ్డ పేరు వస్తుందని ఆందోళన చెందారు. ఎంత సేపు తమ హోటల్ పరువు పోతుందనే ఆలోచిస్తున్నారే తప్ప. . కస్టమర్ గురించి మాత్రం పట్టించుకోలేదు. రెండేళ్లు గడుస్తున్నా కనీసం స్పందన లేదు.
 
హోటల్ యాజమాన్యంపై ఆగ్రహంతో ఉన్న రాజణ్ణ.. వారిని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయ్యాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి సలహా మేరకు వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం.. హోటల్ యాజమాన్యానిదే తప్పదని తేల్చింది. ఆ హోటల్‌కు రూ.55వేల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించింది. 
 
ఆ డబ్బును రాజణ్ణకు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. వినియోగదారుల ఫోరం తీర్పుపై రాజణ్ణ హర్షం వ్యక్తం చేశాడు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురయితే, తాను చేసినట్లుగానే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నాడు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఆయా సంస్థలు, కంపెనీల బాధ్యత అని స్పష్టం చేశాడు.