గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (09:46 IST)

ఇల్లూవాకిలి లేని మోడీని గెలిపిస్తే తప్పేంటి.. : రాందేవ్ బాబా

సొంతిల్లూ, పిల్లాపాపలు లేని ప్రధాని నరేంద్ర మోడీని గెలిపిస్తే తప్పేంటని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రశ్నించారు. 17వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమైన విషయం తెల్సిందే. కానీ, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలించారు. 
 
"అసలు, నరేంద్ర మోదీ ఏం తప్పు చేశారని ఆయన్ను ఓడించాలంటున్నారు? దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఆయనకు ఇల్లు లేదు, కుటుంబం లేదు. సొంత ప్రయోజనాలు అసలే లేవు. అలాంటి వ్యక్తికి అందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది" అంటూ పిలుపునిచ్చారు.
 
నరేంద్ర మోడీ మళ్లీ అధికారం చేపట్టకుండా ఉండడానికి వ్యతిరేక శక్తులైన కొన్ని ముస్లిం, క్రైస్తవ దేశాలు కోట్ల రూపాయలు పంపిస్తున్నాయని మండిపడ్డారు. కానీ, మోడీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలకు మోడీ నాయకత్వంలోనే భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన బీజేపీకి మద్దతుగా జైపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు.