1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:13 IST)

మణిపూర్ మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాలు...

deadbody
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 175 మంది వరకు చనిపోయారు. వీరిలో 96 మంది మృతుల మృతదేహాలు ఇంకా ఆస్పత్రుల్లోని మార్చురీల్లో మగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని మణిపూర్ రాష్ట్ర పోలీస్ విభాగం వెల్లడించింది. ఈ ఘర్షణల్లో 33 మంది ఆచూకీ కనిపించడం లేదని, మరో 1118 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. చనిపోయిన 175 మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. 
 
మే 3వ తేదీన తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది. కొన్నినెలలపాటు అది కొనసాగింది. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 
 
ఈ క్రమంలోనే రాష్ట్రం గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. 5,172 నిప్పటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు 4,786 ఇళ్లు, 386 ప్రార్థనా మందిరాలకు నిప్పు అంటించారు. రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668  ఆయుధాలను లూటీ చేశారు. వాటిల్లో 1,329 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక భద్రతా బలగాలు 360 బంకర్లను ధ్వంసం చేశారు. మైదాన, పర్వత ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను గురువారం తొలగించారు.