1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (14:46 IST)

రాజస్థాన్ కోటలో మరో ఇద్దరు విద్యార్థుల మృతి

suicide
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పరీక్ష రాసిన కొద్దిసేపటికే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు నెలల పాటు కోటలో కోచింగ్ ఎగ్జామ్స్‌ను బ్యాన్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలావుంటే, ఈ యేడాది ఇప్పటివరకు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 24కు చేరింది.
 
మృతులను మహారాష్ట్రకు చెందిన 18 యేళ్ళ ఆవిష్కార్ సంభాజీ కాస్లే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదర్శ్ రాజ్‌గా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు కోచింగ్ ఇనిస్టిట్యూట్‌‍ ఆరో అంతస్తు నుంచి ఆవిష్కార్ దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. నీట్ కోసం మూడేళ్ళ నుంచి కోటాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆదర్శ్ రాజ్ కూడా తాను ఉంటున్న ఫ్లాట్‌లో రాత్రి 7 గంటలకు ఉరేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఈ పనికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీచేశారు. కోటాలో రెండు నెలల పాటు ఎలాంటి కోచింగ్ ఎగ్జామ్స్ నిర్వహించరాదని ఆదేశించారు. కోటాలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మనోధైర్యం చెప్పాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.