మధ్యప్రదేశ్లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ
అదేమన్నా బొమ్మకార్లతో ఆడుకునే వంతెన అనుకున్నారో ఏమోగానీ వాహనాలు వెళ్లాల్సిన వంతెనను 90 డిగ్రీల మలుపుతో కట్టేసారు ఆ ఇంజినీర్లు. ఈ బ్రిడ్జి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు కూడా చేసారు. ఇలాంటి డిజైన్లను గీచిన ఇంజనీర్లు ఎవర్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ పడుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వ్యవహారం కాస్తా దేశం అంతా చర్చనీయాంశంగా మారింది. దీనితో ప్రభుత్వ పెద్దలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజా ధనాన్ని ఇలా బాధ్యతారాహిత్యంగా దుర్వినియోగం చేయడంపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంజినీర్లు చేసిన నిర్వాకానికి ప్రభుత్వం ఏడుగురిపై సస్పెన్షన్ విధించింది.
నిర్మాణ ఏజెన్సీ, డిజైన్ రూపొందించిన కన్సల్టెంట్లను బ్లాక్ లిస్టులో చేర్చింది. కాగా ఈ బ్రిడ్జిని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఐష్ బాగ్ వద్ద 18 కోట్లు వెచ్చించి ఇటీవలే ఓ రైల్వే వంతెనను కట్టారు. ఈ బ్రిడ్జి 90 డిగ్రీలతో మలుపు కలిగి వుండటంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అది కాస్తా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.