1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (16:40 IST)

మంటకలిసిన మానవత్వం - పిల్లోడిని చంపేసి కూలర్లో కుక్కారు..

murder
కొందరు మనుషుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఫలితంగానే సభ్య సమాజం తలదించుకునే సంఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ క్రూరమైన చర్యకు కొందరు వ్యక్తుల పాల్పడ్డారు. ఐదేళ్ల బాలుడుని హత్య చేసిన కొందరు కిరాతకులు.. మృతదేహాన్ని కూలర్లో కుక్కారు. ఈ కిరాతక చర్య రాష్ట్రంలోని భింద్ జిల్లాలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదేళ్ల బాలుడు ట్యూషన్‌కు వెళ్లాడు. కానీ, ట్యూషన్ సెంటర్‌కు వెళ్లలేదు. పైగా, రాత్రి పొద్దుపోయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు. 
 
ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి అక్కడ చదువుకునే విద్యార్థుల వద్ద ఆరా తీశారు. ఈ బాలుడు ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న సంతోష్ చౌరాసియా ఇంటికి వెళ్లినట్టు వెల్లడించారు. దీంతో చౌరాసియా ఇంట్లో సోదాలు చేయగా, అక్కడి దృశ్యం చూసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలుడిని చంపేసి కూలర్‌లో కుక్కివుండటాన్ని చూసి విస్తుపోయారు. ఈ దారుణం వెనుక అసలు కారణం ఏంటి, కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక మూఢ నమ్మకాలతో బలిచ్చారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.