1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:34 IST)

అతడికి సర్వస్వం అర్పించాక అసలు విషయం తెలిసింది, అలాక్కాదు ఇలా చచ్చిపో అన్నాడు

ప్రియుడే సర్వస్వం అనుకుంది. అతన్నే నమ్ముకుంది. పెళ్ళి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంది. కొత్త జీవితం ప్రారంభించి సంతోషంగా ఉందామనుకుంది. కానీ ఆమె ఆశ మొత్తం ఆవిరిగా మారిపోయింది. ప్రియుడికి ఇదివరకే పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. 
 
చెన్నైలోని పెరుంబాక్కం ప్రాంతానికి చెందిన భారతి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. విరుదునగర్ జిల్లా అలుంకుళంకి చెందిన ముత్తు కుమరేశన్‌తో ఆమెకు వీడియో చాట్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సరిగ్గా రెండు నెలల క్రితం జరిగింది. నాగపూర్‌లో ఆర్మీ ఆంబులెన్స్ డ్రైవర్‌గా ముత్తు పనిచేసేవాడు.
 
భారతితో మాట్లాడేందుకు గత నెల వచ్చాడు ముత్తు. ప్రియుడిపై నమ్మకం పెట్టుకోవడమే కాకుండా ఆమె తన సర్వస్వాన్ని అర్పించింది. అయితే చివరకు ఈనెల మూడవ తేదీన మరోసారి వచ్చిన ముత్తు తనకు వివాహమైందని, ఇద్దరు పిల్లలున్నారని చెప్పాడు. దీంతో ఆమె షాకయ్యింది.
 
రెండో పెళ్ళి చేసుకుని చూసుకుంటానని చెప్పాడు ముత్తు. భారతి ఆవేదన చెందింది. ప్రియుడిని దూరం పెట్టాలనుకుంది. కానీ పదేపదే ముత్తు ఫోన్ చేస్తూ ఆమెను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. తనను ఇలా హింసిస్తే కత్తితో పొడుచుకుని చనిపోతానని వీడియో కాల్ చేసి చెప్పింది. 
 
కత్తి కన్నా ఉరి వేసుకుని చచ్చిపో ఇబ్బంది లేకుండా చచ్చిపోతావ్ అంటూ ముత్తు అన్నాడు. అప్పటికే ఎంతో కోపంతో ఉన్న భారతి నిజంగానే వీడియో కాల్ చేసి ముత్తును లైన్లో పెట్టి అతడి ముందే ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భారతి మృతికి ముత్తునే కారణమని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.