1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Air India issues travel advisory, over 15 flights diverted amid Israel-Iran conflict

ఇరాన్ గగనతలం మూసివేత - ఎయిరిండియా విమానాల దారిమళ్లింపు

flights
ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై గురువారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఇరాన్ ముందస్తు చర్యల్లో భాగంగా, తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత్‌కు చెందిన ఎయిరిండియా విమానాలను దారి మళ్లించారు. ఇరాన్ గగనతలం మూసివేయడంతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఏఐ131ను అత్యవసరంగా దారి మళ్లించాల్సివచ్చింది. అలాగే, మరో 15 విమానాలను కూడా ఎయిరిండియా దారి మళ్లించడమో, వెనక్కి పిలిపించడమే చేసినట్టు సమాచారం. 
 
షెడ్యూల్ ప్రకారం నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిండియా విమానం సాధారణంగా ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే, ఇజ్రాయెల్ జరిపిన సైనిక చర్య నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు తెలిపింది. 
 
ఈ ఆకస్మిక నిర్ణయంతో అప్పటికే ప్రయాణంలో ఉన్న పలు విమాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులోభాగంగానే ఎయిరిండియా విమానాన్ని కూడా దారి మళ్లించారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంది. 
 
ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఇరాన్ తమ గగనతలాన్ని ఎప్పటివరకు మూసివేసివుంచుతుందో ఇంకా స్పష్టతరాలేదు. ప్రస్తుతానికి విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
తర్వాతి కథనం
హనీమూన్ మర్డర్ కేసు : సోనమ్‌ను పట్టించిన మంగళసూత్రం - ఉంగరం