పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...
తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం పెను విషాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ హృదయ విదాకర ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
కాగా, ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ సజీవంగా బయటపడ్డాడు. మిగిలిన 241 మంది ప్రయాణికులు అగ్నికోరల్లో చిక్కుకుని దహనమైపోయారు. ఈ మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా ఉండటం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను దర్యాప్తు అధికారులు వెలుగులోకి తీసుకునిరానున్నారు.