తల్లుల కన్నీటికి ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం : ప్రధాని మోడీ
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు స్పందించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. దాడిలో పలువురు తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ పేరుతో గట్టిగా బుద్ధి చెప్పడంతో పాటు వారి వెన్నులో వణుకు పుట్టించేలా చేశామన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశాన్ని విభజించాలని చూశారని, మతం పేరుతో పాకిస్థాన్ విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అయితే, కష్టకాలంలో భారతీయులంతా ఐక్యంగా నిలిచి వారి కుట్రలను తిప్పికొట్టారన్నారు. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో పాకిస్థాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయని తెలిపారు.
సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించాల్సివుంది. కానీ, ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అదేసమయంలో ఆయన సిక్కిం ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. సిక్కింను కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక హరిత రాష్ట్రం (గ్రీన్ మోడల్ స్టేట్)గా అభివృద్ధి చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ, పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై ఇది రూపుదిద్దుకుంటోందన్నారు. సిక్కిం రైతులు వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నామని ప్రశంసించారు. ఇది రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.