1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (09:56 IST)

దేశ ప్రధాని పదవి నుంచి మోడీ తప్పుకోవాలి : అరుంధతీరాయ్

దేశంలో ప్రస్తుతం ప్రభుత్వమన్నదే లేదని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమకు అత్యవసరంగా ఓ ప్రభుత్వం కావాలని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ అన్నారు. ముఖ్యంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని, అందువల్ల ఆయన తక్షణం తప్పుకోవాలని కోరారు.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పూర్తిగాకాకున్నా కనీసం తాత్కాలికంగానైనా దిగిపోవాలని ఆమె కోరారు. 
 
స్క్రోల్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌కు రాసిన లేఖలో ఆమె మోదీని తూర్పారబట్టారు. 2024 వరకు వేచి ఉండలేమని, నేడు ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోతున్నారని అరుంధతీరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని మరీ కోట్లాదిమంది సహచర పౌరులతో గొంతు కలిపి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం మీ చేతుల్లో లేదని, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎదుటివారి నుంచి ప్రశ్నను స్వీకరించలేని ప్రధాని ఉన్నప్పుడు వైరస్ మరింతగా చెలరేగిపోతుందన్నారు.
 
ఇప్పుడు ప్రధాని కనుక తన పదవి నుంచి తప్పుకోకపోతే తమలో లక్షలాదిమంది అనవసరంగా చనిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని వేడుకున్నారు. ప్రధాని స్థానాన్ని తీసుకోవడానికి ఆ పార్టీలోనే చాలామంది ఉన్నారన్నారు. 
 
ప్రస్తుత వైరస్‌కు నిరంకుశత్వాలంటే చాలా ఇష్టమని, మీ అసమర్థత, ఇతర దేశాలు మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఒక సాధికారత కారణమవుతుందని అన్నారు. కష్టపడి సాధించుకున్న సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని, కాబట్టి దిగిపోవాలని ఆమె కోరారు.