శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (17:20 IST)

అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం.. మీడియాకు మార్గదర్శకాలు

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పుకు అనంతరం సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిస్థాయిలో సమీక్షించిన వక్ఫ్ బోర్డు, అయోధ్య వివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది.
 
అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పు రాగానే సున్నీ వక్ఫ్ బోర్డు ఆచితూచి వ్యవహరించాలని భావించినా, కొన్నిగంటల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రివ్యూ పిటిష న్ దాఖలు చేయకూడదని నిర్ణయించినట్లు ప్రకటించింది. 
 
మరోవైపు అయోధ్య తీర్పుకు అనంతరం మీడియాకు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలను నిరోధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మార్గదర్శకాలు జారీచేసింది. చానళ్లలో చేపట్టే చర్చా కార్యక్రమాలు, డిబేట్లు, రిపోర్టింగ్ సందర్భంగా ప్రోగ్రామ్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. 
 
ఛానెళ్లతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా ప్రోగ్రామ్ కోడ్‌ను పాటించాలని స్పష్టం చేసింది. ఇది అన్ని చానళ్లకు, దేశంలోని అందరు కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.