ప్రేమ చేసిన హత్య : ప్రేయసితో సన్నిహితంగా ఉంటున్నాడనీ ఐరన్ రాడ్తో కొట్టి చంపేసిన ప్రియుడు!
బెంగుళూరులో ప్రేమ ఓ హత్య చేసింది. ప్రేమ ఏంటి హత్య చేయడమేంటనే కదా మీ సందేహం. ఇది నిజం. తన ప్రియురాలితో ఓ యువకుడు సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ఆ యువకుడిని పక్కా ప్లాన్తో కిడ్నాప్ చే
బెంగుళూరులో ప్రేమ ఓ హత్య చేసింది. ప్రేమ ఏంటి హత్య చేయడమేంటనే కదా మీ సందేహం. ఇది నిజం. తన ప్రియురాలితో ఓ యువకుడు సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు.. ఆ యువకుడిని పక్కా ప్లాన్తో కిడ్నాప్ చేసి.. తలపై ఐరన్ రాడ్తో అతి క్రూరంగా కొట్టి చంపేశాడు. బెంగుళూరులో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...!
బెంగళూరులోని జయనగర్లో యోగేష్ అనే యువకుడు తన అక్కతో కలిసి నివాసముంటున్నాడు. యోగేష్ స్వస్థలం మగాదిలోని అత్తింజర్ గ్రామం. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనికి చేశారు. ఫేస్బుక్లో చాటింగ్ చేసే అలవాటు ఉండే యోగేష్కు మైసూర్కు చెందిన ఓ యువతి పరిచయమైంది. దీంతో వారిద్దరు చాలా చనువుగా ఉంటూ వచ్చారు. పలు మార్లు ఆ యువతి కోసం యోగేష్ మైసూర్కు కూడా వెళ్లి కలిసి వచ్చాడు.
అయితే, ఆ యువతి అప్పటికే మరో యువకుడి ప్రేమలో పడింది. ఇపుడు యోగేష్తో చనువుగా ఉండటాన్ని ఆమె ప్రియుడు జీర్ణించుకోలేక పోయారు. దీంతో యోగేష్తో మాట్లాడొద్దని హెచ్చరించాడు. అతను తన స్నేహితుడని, తనతో మాట్లాడితే తప్పేంటని ఆమె ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. అతనెవరైనా సరే మాట్లాడటం తనకు నచ్చలేదని ఆమెకు తెగేసి చెప్పాడు. కానీ ఆమె మాత్రం నువ్వు వేరే, తను వేరే అంటూ ఆ స్నేహాన్ని కొనసాగించింది.
ఇదే ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉంటున్న ఆ యువకుడిపై ప్రియుడు పగ పెంచుకున్నాడు. పక్కా ప్లానింగ్తో ఈనెల 19న సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న యోగేష్ను కిడ్నాప్ చేశారు. యోగేష్ను ఓ ఫామ్ హౌస్కు తీసుకెళ్లిన ప్రతాప్ ఇనుపరాడ్తో కొట్టి క్రూరంగా హతమార్చాడు. పనికి వెళ్లిన తన సోదరుడు ఇంటికి రాక పోవడంతో యోగేష్ అక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు కింద నమోదు చేశారు. ఆ తర్వాత యోగేష్ మొబైల్ ఫోన్కాల్ డేటాను పరిశీలించగా, అసలు విషయం వెలుగు చూసింది.
అయితే ఈ హత్యలో యువతి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ప్రతాప్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో పోలీసులు వేరే పనిలో ఉండగా పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. ప్రతాప్ తండ్రి శివకుమార్ రాజ్య గోసంరక్షణ సమితి అధ్యక్షుడు కావడం గమనార్హం.