1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (09:57 IST)

ఆంబులెన్స్‌లోని ఇవ్వని సర్కారు ఆస్పత్రి వైద్యులు .. కొడుకు శవాన్ని భుజంపై వేసుకుని...

నవభారత్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆంబులెన్స్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. చివరకు మృతదేహాల తరలింపునకు కూడా ఆంబులెన్స్‌లు సమకూర్చలేని దుస్థితిలో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. తాజాగా ఓ తండ్రి.. తన కన్నబిడ్డ శవాన్ని భుజంపై వేసుకుని ఇంటికి మోసుకెళ్లిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని నలందలో కడుపునొప్పితో పాటు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎనిమిదేళ్ళ కుమారుడిని ఓ వ్యక్తి నలంద సదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం చనిపోయాడు. 
 
ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ సమకూర్చాలని తీవ్ర దుఃఖంలో ఉన్న కన్నతండ్రి ఆస్పత్రి వైద్యులను కోరారు. ప్రభుత్వ ఆంబులెన్స్ అందుబాటులో లేదని, అందువల్ల మీరే శవాన్ని తీసుకెళ్లాలని చెప్పాడు. పైగా, ఎంతలా వేడుకున్నప్పటికీ ఆస్పత్రి వైద్యులు మాత్రం ఏమాత్రం కనికరించలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ కన్నతండ్రి.. మృతి చెందిన కన్నబిడ్డ శవాన్ని భుజంపై వేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. 
 
కన్నబిడ్డ శవాన్ని ఎవరో మోసుకెళ్లడాన్ని కొందరు గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇపుడు వైరల్ అయింది. గతంలో కూడా ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని కొన్ని కిలోమీటర్ల దూరం భుజంపై వేసుకుని నడిచి వెళ్లిన విషయం తెల్సిందే. ఇపుడు కూడా అలాంటి సంఘటనే అదే బీహార్ రాష్ట్రంలో జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్ యోగేంద్ర సింగ్ విచారణకు ఆదేశించారు.