1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జులై 2023 (09:08 IST)

గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి ఇల్లు కూల్చివేత

urinate
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే ప్రతినిధిగా చెప్పుకునే పర్వేశ్ శుక్లాకు ఆ రాష్ట్ర అధికారులు తీవ్రమైన శిక్ష విధించారు. ఏకంగా అతని ఇంటిని కూల్చివేశారు. తమ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని చూసిన అతని కుటుంబ సభ్యులు హతాశులైపోయారు. తమ కుమారుడిపై కుట్ర పన్నారంటూ నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పైగా, ఎపుడో జరిగిన పాత వీడియోను ఉద్దేశ్యపూర్వకంగా బయటకు తీశారని పేర్కొంటున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై పర్వేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నీచపనికి పాల్పడిన పర్వేజ్ శుక్లాను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. 
 
తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అతడి ఇంటిని కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. ప్రస్తుతం పర్వేజ్ శుక్లా రేవా కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఆదేశాలతో ఆయనపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. పైగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హోం శాఖ స్పష్టం చేసింది.
 
ఇదిలావుంటే పర్వేశ్ శుక్లా ఇంటిని కూల్చివేయడాన్ని చూసిన ఆయన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి నేరానికి సాక్ష్యంగా పోలీసులు ప్రస్తావిస్తున్న వీడియో చాలా పాతదని చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో రాజకీయ కారణాలతో దీన్ని వెలుగులోకి తెచ్చారని ఆరోపించారు.