1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (16:58 IST)

చిరంజీవిపై ఉమెన్ చాందీ సెన్సేషనల్ కామెంట్లు.. కాంగ్రెస్‌లో కొనసాగట్లేదు..!

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదన్నారు. వచ్చే నెల 7 నుంచి 17 వరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఉమెన్ చాందీతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
 
అయితే ఈ నిరసనల్లో చిరంజీవి పాల్గొంటారా ? అని కొందరు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఉమెన్ చాందీ.. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో చిరంజీవి బంధం ముగిసిపోయిందనే అంశంపై ఆ పార్టీ దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. ఆ తరువాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడంతో రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. సినిమాలపై దృష్టి సారించారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్, కేసీఆర్‌లపై చిరంజీవి చాలా సందర్భాల్లో పొగడ్తలు కురిపించారు.
 
తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాలు కొనసాగిస్తున్నప్పటికీ.. చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉమన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌తో చిరంజీవి బంధం పూర్తిగా ముగిసిపోయిందనే ప్రచారం మొదలైంది. మరి.. ఉమెన్ చాందీ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.