ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:21 IST)

దేశంలో 10 వేలు దాటిన కరోనా కేసులు - ఒక్కో రాష్ట్రంలో ఎన్నెన్ని?

దేశంలో కరోనా కేసులు పదివేలు దాటిపోయాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 1,244 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,363కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను మంగళవారం వెల్లడించింది. ఇదేసమయంలో ఇప్పటివరకూ 339 మంది మరణించారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 1,035 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.
 
ఇకపోతే, రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే, మహారాష్ట్రలో అత్యధికంగా 2334 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 1510 కేసులు, తమిళనాడులో 1173 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 50 శాతం నమోదుకావడం ఇపుడు ఆయా రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 873, మధ్య ప్రదేశ్‌లో 604, తెలంగాణలో 562, ఉత్తర ప్రదేశ్‌లో 558, గుజరాత్‌లో 539 కేసులు వచ్చాయి. 
 
మిగతా రాష్ట్రాల్లోని కేసులను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 432, అండమాన్ దీవుల్లో 11, అసోంలో 31, బీహారులో 65, చండీగడ్‌లో 21, చత్తీస్‌గఢ్‌లో 31, గోవాలో 7, గుజరాత్‌లో 539, హర్యానాలో 185, హిమాచల్ ప్రదేశ్‌లో 32, జమ్మూకాశ్మీర్‌లో 270 కేసులు నమోదయ్యాయి.
 
ఇక ఝార్ఖండ్‌లో 24, కర్ణాటకలో 247, కేరళలో 379, లడఖ్‌లో 15, మణిపూర్‌లో 2, ఒడిశాలో 54, పుదుచ్చేరిలో 7, పంజాబ్‌లో 167, త్రిపురలో 2, ఉత్తరాఖండ్‌లో 35, పశ్చిమ బెంగాల్‌లో 190 కేసులు నమోదు కాగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
 
అలాగే, దేశంలో సంభవించిన కరోనా మరణాల సంఖ్య 339గా ఉంది. వీటిలో దాదాపు సగం... అంటే 160 మంది ఒక్క మహారాష్ట్రలోనే చనిపోయారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 43, ఢిల్లీలో 28 మంది, గుజరాత్‌లో 26 మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకూ దేశంలో 2 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.