ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (17:16 IST)

ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ.. అయినా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి.. కేజ్రీవాల్

కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 31వ తేదీ నుంచి అన్‌లాక్ ప్రక్రియ షూరూ కానున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ఉంటుందని ఆయన తెలిపారు. అన్‌లాక్ ప్రక్రియ మొదలైనా కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్‌పై ఢిల్లీ నియంత్రణ సాధించిందని.. అయితే వైరస్‌పై పోరాటం ముగియలేదని కేజ్రీవాల్ అన్నారు.
 
ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశంలో, లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయాలని నిర్ణయించారు. గత శనివారం మరో వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్.. కరోనా కేసులు తగ్గుదల కొనసాగితే మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. ముందుగా చెప్పినట్టుగానే సీఎం కేజ్రీవాల్ అన్‌లాక్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
ఇందులో భాగంగా సోమవారం నుంచి ఉత్పాదక యూనిట్లు, పారిశ్రామిక యూనిట్లకు అనుమతిస్తామని.. అలాగే కనస్ట్రక్షన్ వర్కర్లకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు సీఎం కేజ్రివాల్ స్పష్టం చేశారు. అన్‌లాక్ ప్రక్రియలో ముందుగా అట్టడుగు వర్గాలవారిని దృష్టిలో ఉంచుకోవాలని, వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అన్నారు. రోజువారీ కూలీలు, కార్మికులు, వలస కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. 
 
ఫ్యాక్టరీలను తెరవడంతో పాటుగా, నిర్మాణ కార్యాకలాపాలను అనుమతించాలని నిర్ణయించినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రతివారం నిపుణులు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా, కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీలో మొదటిసారి ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.