బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:18 IST)

చెన్నై రైల్వే స్టేషనులో బాంబు అంటూ తాగుబోతు ఫోన్ కాల్

ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్ననేపథ్యంలో దేశ ప్రజల్లో ఆందోళన నెలకొని ఉంది. భారత్ జైషే మహమ్మద్ శిబిరాలపై దాడులు జరిపిన తర్వాత పాక్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉండే ప్రధాన నగరాల్లో వచ్చే 72 గంటల పాటు హైఅలర్ట్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఓ తాగుబోతు చేసిన పనికి చెన్నై పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు.
 
మంగళవారం నాడు చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో బాంబు దాడి జరగబోతోందని చెప్పాడు. తన భార్య వేరెవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఈ విషయం విన్నానని, ఇందులో ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ని జల్లెడపట్టారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లభించకపోయేసరికి, అది కాస్తా ఫేక్ కాల్‌గా గుర్తించారు.
 
గతంలో కూడా ఇదే రైల్వే స్టేషన్‌లో బాంబు పేలిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీయగా, అతడు తేనాంపేటలో కార్పెంటర్‌గా పనిచేసే శరవణన్‌గా గుర్తించారు. భార్యతో ఉన్న విభేదాల కారణంగా, ఆమెపై కక్ష సాధించుకునేందుకు ఫేక్ కాల్ చేసి ఆమెను ఇందులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. కాగా తాగిన మత్తులోనే ఫేక్ కాల్ చేసాడని పోలీసులు ధృవీకరించారు. శరవణన్ భార్యకు అసలు విషయం ఏమీ తెలియదని, అతడిని మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.