గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:38 IST)

దేశంలో కరోనా మహోగ్రరూపం : విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం

దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపందాల్చింది. ఈ వైరస్ దెబ్బకు అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
మే 2న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు, ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. 
 
విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సయమంలో వారి వెంటనే ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
 
కాగా, ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. బెంగాల్‌లో ఇప్పటికే ఏడు దశల పోలింగ్‌ పూర్తవగా.. ఏప్రిల్‌ 29న చివరి విడత ఓటింగ్‌ నిర్వహించనున్నారు. 
 
అయితే కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ ఎన్నికలు విమర్శలకు దారితీశాయి. ప్రచారం పేరుతో రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడంతో ఎన్నికలు సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లుగా మారాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవైపు ఎన్నికల ఎఫెక్ట్‌ పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగానే పడింది. అక్కడ గత కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో బెంగాల్‌లో అన్ని రోడ్‌షోలు, పాదయాత్రలు, ర్యాలీలను ఈసీ నిషేధించింది. ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితి మరింతగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు నిర్వహించిన బహిరంగ సభలేనని అనేక మంది ఆరోపిస్తున్నారు.